ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు
భారతీయ నావికాదళం సైలర్-సీనియర్ సెకెండరీ రిక్రూటర్స్ (ఎస్ఎస్ఆర్), ఆర్టిఫీషర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఈ రెండు పోస్టులకు ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు అర్హులు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాతపరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి ఆగస్టు 2018 నుంచి కోర్సులు ప్రారంభమవుతాయి. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి నావికాదళంలో ఉద్యోగం ఖాయమవుతుంది. ఈ రెండు పోస్టులకు విడిగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటనలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
విద్యార్హత:
ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్తోపాటు కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్స్ వీటిలో ఏదో ఒక సబ్జెక్టు చదివుండాలి. ఆర్టిఫీషర్ అప్రెంటిస్ పోస్టులకు ఈ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. ఈ రెండు పోస్టులకూ కేవలం పురుష అభ్యర్థులే అర్హులు.
వయోపరిమితి:
ఎస్ఈఆర్ పోస్టులకు ఆగస్టు 1, 1997 - జులై 31, 2001 మధ్య జన్మించినవాళ్లు అర్హులు. ఏఏ పోస్టులకు ఆగస్టు 1, 1998- జులై 31, 2001 మధ్య జన్మించినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
రెండు పోస్టులకు రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు (పీఎఫ్టీ), మెడికల్ టెస్టుల ద్వారా అర్హులను ఎంపికచేస్తారు.
పరీక్ష ఇలా...
ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రంలో 4 సెక్షన్లు ఉంటాయి. అవి ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, జనరల్ నాలెడ్జ్. ప్రశ్నలన్నీ 10+2 (ఇంటర్మీడియట్) స్థాయిలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి గంట. అన్ని సెక్షన్లలోనూ కనీస అర్హత మార్కులు సాధించాలి అలాగే నిర్ణీత సగటు కంటే ఎక్కువ స్కోర్ ఉంటేనే తర్వాత దశకు ఎంపికవుతారు.
ఫిజికల్ ఫిట్నెస్ టెస్టు (పీఎఫ్టీ)
రాత పరీక్షలో ఉత్తీర్ణులకు ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల్లో పరుగెత్తాలి. 20 స్క్వేట్ అప్స్, 10 పుష్అప్స్ తీయగలగాలి. క్రీడలు, ఈతలో ప్రావీణ్యం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
మెడికల్ టెస్టులు
ఫిజికల్ టెస్టులో అర్హత సాధించినవారికి ఐఎన్ఎస్-చిల్కాలో మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అభ్యర్థులు కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఊపిరి పీల్చక ముందు, పీల్చిన తర్వాత ఛాతీ కొలతల్లో వ్యత్యాసం కనీసం 5 సెం.మీ. ఉండటం తప్పనిసరి. దృష్టిదోషం, వినికిడి లోపం లాంటివి ఉండరాదు.
శిక్షణ..
మెడికల్ టెస్టులో అర్హత సాధించినవారికి ఆగస్టు 2018 నుంచి ప్రాథమిక శిక్షణ మొదలవుతుంది. ఏఏ పోస్టుకు ఎంపికైనవారికి 9 వారాలపాటు ఐఎన్ఎస్- చిల్క సరస్సులో నిర్వహిస్తారు. అదే ఎస్ఈఆర్ పోస్టుకైతే చిలక సరస్సులో 22 వారాలపాటు శిక్షణ కొనసాగుతుంది. అనంతరం అభ్యర్థులకు కేటాయించిన బ్రాంచ్/ ట్రేడ్ల్లో ఏదైనా నేవీ శిక్షణ కేంద్రంలో తర్వాత దశ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో రూ.14600 స్టైపెండ్గా చెల్లిస్తారు. విజయవంతంగా ప్రొఫెషనల్ శిక్షణను పూర్తిచేసుకున్నవారిని సైలర్ - ఏఏ /ఎస్ఈఆర్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.
ఎంపికైతే...
ఉద్యోగంలో చేరినవారికి రూ. 21700-69100 వేతన శ్రేణితో జీతం లభిస్తుంది. దీంతోపాటు మిలట్రీ సర్వీస్ పే రూ.5200, గ్రూప్-ఎక్స్ పే రూ.6200 ( ఏఏ పోస్టులకు), డీఏ ప్రతినెలా లభిస్తాయి. అన్ని ప్రోత్సాహకాలూ కలుపుకుని ప్రారంభంలోనే రూ.40 వేల వరకు వేతన రూపంలో పొందవచ్చు. ఏఏకు ఎంపికైనవాళ్లు 20 సంవత్సరాలు, ఎస్ఈఆర్లో చేరినవాళ్లు 15 ఏళ్లు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల ఆసక్తి, నేవీ అవసరాలకు అనుగుణంగా సర్వీస్ పొడిగిస్తారు. వ్యవధి తర్వాత పదవీ విరమణ చేసినవారికి పూర్తిస్థాయి పెన్షన్ జీవితాంతం లభిస్తుంది. సైలర్/ఏఏగా విధుల్లో చేరినవారు మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (సుబేదార్) హోదా వరకు చేరుకోవచ్చు.
దరఖాస్తులు: ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 10
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
Comments
Post a Comment