ఆర్‌బీఐలో 526 ఆఫీస్ అటెండెంట్‌ పోస్టులు

పదో తరగతి/ మెట్రిక్యులేషన్‌ విద్యార్హతతో నెలకు రూ.20,000కు పైగా జీతం పొందే అవకాశం వచ్చింది! అది కూడా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయాల్లో....! దేశవ్యాప్తంగా 526 ఆఫీసు అటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయటానికి ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ ఆఫీసులో 27 పోస్టులున్నాయి. అత్యధికంగా ముంబయి ఆఫీసులో 165, రెండో అత్యధిక సంఖ్యలో బెంగళూరు ఆఫీసులో 58 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫీస్‌ అటెండెంట్‌ పోస్టుల్లో ప్యూన్‌, దర్వాన్‌, మజ్దూర్‌ అనే మూడు రకాలుంటాయి.. ఆఫీస్‌ అటెండెంట్‌గా విధుల్లో చేరినవారు పదోన్నతిపై సీనియర్‌ ఆఫీస్‌ అటెండెంట్‌గా గుర్తింపు పొందవచ్చు. డిగ్రీ పూర్తి చేసినవారికి ప్రమోషనల్‌ పరీక్ష ద్వారా ఆర్‌బీఐ అసిస్టెంట్‌ అయ్యే అవకాశాన్నీ కల్పిస్తారు. * దరఖాస్తు ముగింపు: 07.12.2017 * ఆన్‌లైన్‌ రాతపరీక్ష: డిసెంబరు 2017/ జనవరి 2018 దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వారి వ్యక్తిగత, విద్యా సంబంధ వివరాలను www.rbi.org.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. జనరల్‌, ఓబీసీ కేటగిరీలవారు రూ.450 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. మిగిలిన కేటగిరీలవారు రూ.50 ఆన్‌లైన్‌ విధానంలో చెల్లించాలి. విద్యార్హతలు: 01.11.2017 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల్లోపు ఉండాలి. 02.11.1992 నుంచి 01.11.1999 మధ్య జన్మించినవారు ఈ పరీక్షకు అర్హులు. ఎస్‌సీ, ఎస్‌టీ కేటగిరీలవారికి అయిదేళ్లు, ఓబీసీవారికి మూడేళ్లు, పీడబ్ల్యూడీ వారికి పదేళ్ల మినహాయింపు ఉంది. ఎంచుకున్న ఆర్‌బీఐ శాఖ ఏ రాష్ట్రంలో ఉందో, దానికి సంబంధించిన భాషలో అభ్యర్థుల మాట్లాడగల, రాయగల, చదవగల నైపుణ్యాలను పరీక్షిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను వెల్లడించి, తరువాత వారికి భాషా ప్రావీణ్య పరీక్షను నిర్వహిస్తారు.అభ్యర్థులు వారికి ఏయే భాషలపై ప్రావీణ్యముందో దానినిబట్టి మాత్రమే ఆర్‌బీఐ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. రుణాత్మక మార్కులు ఉన్నాయి. కాబట్టి తెలిసిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలను గుర్తించాలి. పదో తరగతి విద్యార్హతతో పరీక్ష కాబట్టి, ప్రశ్నలస్థాయి సులువుగానే ఉంటుంది. దాదాపుగా రెండు నెలల సమయం ఉంది కాబట్టి, మంచి మెటీరియల్‌ను సిద్ధం చేసుకుని, ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవ్వాలి. రోజులో వీలైనంత సమయం సన్నద్ధతకు కేటాయిస్తే తప్పక విజయం సాధించవచ్చు!

Comments