పిబ్రవరి కరెంట్ అఫైర్స్ 01-07వరకు

అంతర్జాతీయం 
అఫ్గానిస్తాన్‌లో చైనా మిలటరీ బేస్ ఏర్పాటు 
అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ నిర్మించేందుకు చైనా ఆ దేశంతో చర్చలు జరుపుతోందని అఫ్గానిస్తాన్ అధికారులు తెలిపారు. పర్వతాలతో కూడిన వాఖన్ కారిడార్ నుంచి తమ సరిహద్దు ప్రాంతం జిన్‌జియాంగ్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశిస్తున్నారని ఆందోళన చెందుతున్న చైనా..అక్కడ మిలటరీ బేస్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అఫ్గానిస్తాన్‌లో మిలటరీ బేస్ ఏర్పాటు
ఎప్పుడు : త్వరలో
ఎవరు : చైనా
ఎందుకు : ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కోవడానికి

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం
జైళ్లలో ఉన్న ప్రతిపక్ష నేతల శిక్షల్ని రద్దు చేస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మాల్దీవుల్లో మరోసారి రాజకీయ అనిశ్చితి తలెత్తింది. జైలు శిక్ష ఎదుర్కొంటోన్న మాజీ అధ్యక్షుడు నషీద్ ప్రవాసంలో ఉండగా.. జైళ్లలో ఉన్న మిగిలిన రాజకీయ నేతల్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. వివాదాస్పదమైన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నషీద్‌పై విజయం సాధించాక యమీన్ అధికారంలోకి వచ్చారు. అనంతరం స్వపక్షంలోని అసంతృప్త నేతలు, ప్రతిపక్ష నేతలను యమీన్ జైల్లో పెట్టించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాల్దీవుల్లో రాజకీయ అనిశ్చితి
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : యమీన్
ఎందుకు : జైళ్లల్లో ఉన్న రాజకీయ నాయకులను విడుదల చేయమని ఆ దేశ సుప్రీంకోర్టు ప్రకటించిన నేపథ్యంలో

అణు’ ఆధునీకరణకు అమెరికా కొత్త విధానం 
అణ్వస్త్రాలను ఆధునీకరించేందుకు, చిన్నస్థాయి అణ్వాయుధాల తయారీకి వీలుగా అమెరికా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. 100 పేజీలతో న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 పేరిట తీసుకొచ్చిన ఈ విధానం ద్వారా అమెరికా, దాని మిత్రదేశాలపై జరిగే అణు దాడుల్ని నిరోధించవచ్చని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ విధానంపై పెంటగాన్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘21వ శతాబ్దంలో అమెరికాకు ఎదురవుతున్న అనేక రకాల ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ విధానం చాలా అనువైనదని పేర్కొన్నారు. అణ్వాయుధ కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్ విభాగాలతో పాటు సంప్రదాయ, అణ్వాయుధాలు ప్రయోగించే విమానాలు, భూ,సముద్ర, వాయు మార్గాల నుంచి దాడిచేసే సామర్థ్యం ఆధునీకరణకు ఈ విధానం దోహదం చేస్తుందని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈ విధానం అణువ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ), అణ్వాయుధాల నియంత్రణతో పాటు అణు పరీక్షల నిషేధంపై అమెరికా నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది అని వెల్లడించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘అణు’ ఆధునీకరణకు న్యూక్లియర్ పోస్టర్ రివ్యూ(ఎన్‌పీఆర్)-2018 విధానం 
ఎప్పుడు : ఫిబ్రవరి 3 
ఎవరు : అమెరికా 

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం-కారణాలు 
దక్షిణ ఆసియాలోని మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ముదిరింది. ఆ దేశ ప్రభుత్వం ఫిబ్రవరి 5న పార్లమెంట్‌ను సస్పెండ్ చేసి 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. కొన్ని గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో న్యాయమూర్తిని అరెస్టు చేయించింది. మాజీ అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయూమ్ కూడా నిర్బంధంలో ఉన్నారు.
సంక్షోభానికి కారణం..
వివిధ కేసుల్లో మాజీ అధ్యక్షుడు మొహమద్ నషీద్ సహా పలువురు రాజకీయ నాయకులపై జరుగుతున్న విచారణ చెల్లదని సుప్రీంకోర్టు 2018 జనవరిలో ప్రకటించింది. నిర్బంధంలో ఉన్న 9 మంది ప్రతిపక్ష ఎంపీల విడుదలకు ఆదేశాలు ఇచ్చింది. మొహమద్ నషీద్‌పై 2015లో చేపట్టిన విచారణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మాల్ద్దీవుల్లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడుగా గుర్తింపు పొందిన నషీద్ ప్రస్తుతం ప్రవాసంలో ఉన్నారు. 
అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులను కోర్టు ఆదేశాలకు అనుగుణంగా విడుదల చేయడానికి ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ నిరాకరించడంతో మాల్దీవుల్లో సంక్షోభం తలెత్తింది. ప్రతిపక్ష నేతలకు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేపట్టారు. 
భారత్ సహాయాన్ని కోరిన నషీద్..
తమ దేశంలో రాజకీయ సంక్షోభానికి తెరదించేందుకు భారత్ తన సైన్యాన్ని పంపించి సాయం చేయాలని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కోరారు. మాల్దీవుల్లో అత్యవసర స్థితిని ప్రకటించడం సైనిక పాలనను ప్రవేశపెట్టడం వంటిదేనని.. ఇది రాజ్యాంగవిరుద్ధం, అక్రమమని ఆయన పేర్కొన్నారు. కాగా, మాల్దీవుల్లో అత్యవసర పరిస్థితి విధించడంతో తాము కలత చెందామని భారత్ పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తిని అరెస్టు చేయించడం ఆందోళనకరమంది. మాల్దీవులకు సాయం చేసే విషయంలో భారత్ నిర్దిష్ట కార్యాచరణ విధానాన్ని అనుసరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
మాల్దీవుల్లో సంక్షోభంతో భారత్, చైనాపై ప్రభావం 
హిందూ మహా సముద్ర ద్వీప దేశం మాల్దీవుల్లో నెలకొన్న తీవ్ర సంక్షోభం ఇండియాను కలవరపెడుతోంది. ఇటీవలే మాల్దీవులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్న మరో ఆసియా దిగ్గజం చైనా కూడా తన వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. భారత నౌకా రవాణాకు అత్యంత కీలకమైన హిందూ మహాసముద్ర ప్రాంతంలోని మాల్దీవులతో 2011 వరకు భారత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే 2012లో నాటి అధ్యక్షుడు నషీద్ ప్రభుత్వాన్ని పోలీసు, సైనిక తిరుగుబాటులో కూల్చివేసి అబ్దుల్లా యమీన్ అధ్యక్షుడయ్యాక మాల్దీవుల్లో చైనా పలుకుబడి, వ్యాపారం విపరీతంగా పెరిగాయి. రాజధాని మాలేలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించడానికి భారత కంపెనీ జీఎంఆర్‌కు ఇచ్చిన కాంట్రాక్టును కూడా యమీన్ సర్కారు రద్దు చేసింది.
మాల్దీవుల్లో 22 వేల మంది భారతీయులు
లక్ష దీవులకు 700 కి.మీ. దూరంలోని ఈ చిన్న దేశం జనాభా నాలుగున్నర లక్షలు. ప్రస్తుతం 22 వేల మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. దేశంలోని మొత్తం 400 మంది వైద్యుల్లో 125 మందికి పైగా భారతీయులే. ఉపాధ్యాయుల్లో నాలుగో వంతు మంది కూడా ఇండియా నుంచి వెళ్లినవారే. దాదాపు అందరూ ముస్లింలే ఉన్న మాల్దీవుల్లో సంక్షోభం ముదిరితే అక్కడ మత ఛాందస వాదం, వాణిజ్య నౌకల దోపిడీ, స్మగ్లింగ్, మాదకద్రవ్యాల రవాణా పెరిగి తన భద్రతకు ముప్పువాటిల్లుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. భారత సరుకు రవాణా 97 శాతం ఈ ప్రాంతం మీదుగానే జరుగుతోంది. 1988లో మాల్దీవులను తమ అధీనంలోకి తెచ్చుకోవడానికి శ్రీలంక తీవ్రవాదుల ముఠా యత్నించినా భారత సైన్యం అండతో నాటి అధ్యక్షుడు గయూమ్ ఆ చర్యను తిప్పికొట్టారు.
2011లో చైనా పాదం
మాల్దీవుల్లో చైనా రాయబార కార్యాలయాన్ని 2011లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఈ ద్వీపదేశంతో చైనా వాణిజ్య సంబంధాలు వేగంగా వృద్ధి చెందాయి. సార్క్ దేశాల్లో పాకిస్తాన్ తర్వాత చైనాతో స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం చేసుకున్న రెండో దేశం మాల్దీవులు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. చైనా చేపడుతున్న ఓబీఓఆర్ ప్రాజెక్టులో మాల్దీవులు కూడా భాగస్వామి. మాలే-హుల్‌హూల్ ద్వీపాల మధ్య వంతెన సహా అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చైనా సహాయంతో ఇక్కడ నిర్మిస్తున్నారు. హిందూ మహాసముద్రంలో సముద్ర సిల్క్ రూట్ ప్రాజెక్టు నిర్మాణంలో మాల్దీవులది కీలకపాత్రగా చైనా భావిస్తోంది. శ్రీలంకలో హంబన్‌టోటా రేవు ప్రాజెక్టుతోపాటు జిబూటీలోనూ సైనిక స్థావరం నిర్మాణానికి స్థలం సంపాదించిన చైనా చెప్పుచేతల్లో నడిచే రాజ్యంగా మాల్దీవులు మారడం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమే. 

శరణార్థులపై నిషేధం ఎత్తేసిన యూఎస్ 
11 దేశాల శరణార్థులపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తున్నట్లు అమెరికా జనవరి 30న ప్రకటించింది. అయితే ఆయా దేశాల నుంచి వచ్చే శరణార్థులు కఠిన తనిఖీలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ జాబితాలో ఇరాన్, లిబియా, ఈజిప్ట్, మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, సిరియా, యెమెన్, ఉత్తర కొరియా ఉన్నాయి.

జాతీయం 
ప్రజాస్వామ్య సూచీలో భారత్‌కు 42వ స్థానం
పెచ్చుమీరుతున్న హిందూ అతివాదం, మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ప్రజాస్వామ్య సూచీలో భారత్ స్థానం మరింత పడిపోయింది. 2016లో భారత్‌కు 32వ స్థానం దక్కగా, 2017లో 42వ స్థానానికి దిగజారి ‘దోషపూరిత ప్రజాస్వామ్య’ దేశాల జాబితాలోనే కొనసాగుతోంది. ఈ లిస్ట్‌లో అమెరికాకు 21వ స్థానం, రష్యాకు 135వ, చైనాకు 139వ స్థానం దక్కాయి. మొత్తం పది మార్కులకు గాను భారత్ 7.23 పాయింట్లు స్కోరు చేయగలిగింది. నార్వేకు అగ్రస్థానం (9.87 పాయింట్లు) దక్కగా ఐస్‌లాండ్, స్వీడన్, న్యూజిలాండ్, డెన్మార్క్, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్ వరుసగా మొదటి పది స్థానాల్లో నిలిచాయి. 165 దేశాలు, రెండు ప్రత్యేక ప్రాంతాలతో ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ (ఈఐయూ) జాబితా రూపొందించింది. మొదటి 19 స్థానాల్లో నిలిచిన దేశాల్లోనే పూర్తిస్థాయి ప్రజాస్వామ్యం ఉన్నట్లు చెప్పింది.
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ ‘ది ఎకనమిస్ట్ గ్రూప్’లోని పరిశోధన, విశ్లేషణ విభాగమే ఈఐయూ. ఇది 1946 నుంచి ఏటా ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యంపై సూచీలను విడుదల చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, పౌర స్వేచ్ఛ, ప్రభుత్వం పనితీరు, రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ సంస్కృతి, మీడియా స్వేచ్ఛ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని.. సంపూర్ణ ప్రజాస్వామ్యం, దోషపూరిత ప్రజాస్వామ్యం, మిశ్రమ పాలన, నిరంకుశ పాలన ఉన్న దేశాలుగా విభజిస్తుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎకనమిస్ట్ ఇంటెలిజెన్‌‌స యూనిట్ ప్రజాస్వామ్య సూచీ - 2017
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : 42వ స్థానంలో భారత్ 

బోఫోర్స్’ పై మళ్లీ పిటిషన్ వేసిన సీబీఐ 
బోఫోర్స్ కుంభకోణంపై 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఫిబ్రవరి 2న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి బీజేపీ నేత అజయ్ అగర్వాల్ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. రూ.64 కోట్లకు సంబంధించిన ఈ కేసులో యూరప్ పారిశ్రామిక వేత్తలైన హిందూజా సోదరులతో సహా పలువురిపై కీలకమైన దస్తావేజులు, సాక్షాలతో సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 
మే 31, 2005న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ సోధి ఈ కుంభకోణంలో సీబీఐ కేసును కొట్టేశారు. అంతకుముందు, 2004 ఫిబ్రవరి 4న మరో జడ్జి జస్టిస్ జేడీ కపూర్ ఈ కేసులో మాజీ ప్రధాని రాజీవ్ ప్రమేయం లేదంటూ నిర్దోషిగా ప్రకటించారు. 
భోఫోర్స్ నేపథ్యం
భారత ప్రభుత్వం స్వీడన్ ఆయుధ తయారీ సంస్థ ఏబీ బోఫోర్స్ మధ్య నాలుగు వందల 155 ఎంఎం హోవిట్జర్‌లను కొనుగోలు చేసేందుకు 1986 మార్చి 24న రూ.1,437 కోట్ల ఒప్పందం కుదిరింది. 1987 ఏప్రిల్ 16న స్వీడన్ రేడియో.. ఆయుధాల కొనుగోలుకు సంబంధించి భారతీయ ప్రముఖ రాజకీయ నాయకులు, రక్షణశాఖ అధికారులకు బోఫోర్స్ ముడుపులు చెల్లించిందని వెల్లడించింది. దీంతో 1990 జనవరి 22న సీబీఐ ఏబీ బోఫోర్స్ అధ్యక్షుడు మార్టిన్ అర్డ్‌బో, మధ్యవర్తులుగా ఉన్న విన్ చద్దా, హిందూజా సోదరులపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతోపాటుగా అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భోఫోర్స్‌పై సుప్రీంకోర్టులో మళ్లీ పిటిషన్
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : సీబీఐ
ఎందుకు : కేసుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు, ఆధారాలు తమ వద్ద ఉన్నాయని

ఢిల్లీలో డీజిల్ ఇంజిన్లు మరో ఏడాదే
ఢిల్లీ ప్రాంతంలో 2019 మార్చి తర్వాత డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైలు ఒక్కటి కూడా ఉండదని అధికారులు తనకు చెప్పినప్పినట్లు రైల్వే మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. 2022 నాటికి దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల వాడకాన్ని నిలిపేసేందుకు కృషి చేస్తున్నామనీ, ఆ తర్వాత నుంచి అన్ని రైళ్లనూ విద్యుత్తు ఇంజిన్లతోనే పరుగులు తీయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రైల్వే 279 విద్యుత్తు ఇంజిన్‌లను అందుబాటులోకి తెచ్చిందనీ, ఈ సంఖ్యను వెయి్యకి పెంచాల్సి ఉందని గోయల్ చెప్పారు. 2019 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా డీజిల్ ఇంజిన్ల స్థానంలో విద్యుత్తు ఇంజిన్లను ప్రవేశపెడితే రైల్వేకు ఏడాదికి రూ.11,500 కోట్లు ఆదా అవడంతోపాటు రైళ్ల వేగం కూడా స్వల్పంగా పెరుగుతుందని అంచనా. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఢిల్లీలో డీజిల్ రైలు ఇంజిన్లు మరో ఏడాదే 
ఎప్పుడు : 2019, మార్చి నాటికి 
ఎవరు : పీయూష్ గోయల్ 

విమాన రద్దీలో ముంబై విమానాశ్రయం అరుదైన రికార్డు 
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన ఘనత సాధించింది. 24 గంటల్లో 980 విమానాల రాకపోకలతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సింగిల్ రన్‌వే విమానాశ్రయంగా రెండో ఏడాది కూడా రికార్డుల్లోకెక్కింది. జనవరి 20న ఈ విమానాశ్రయం ఈ ఘనత సాధించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికార ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 6న 24 గంటల్లో 974 విమానాల రాకపోకలతో తన పేరిట ఉన్న రికార్డును ముంబై ఎయిర్‌పోర్ట్ బద్దలు కొట్టిందన్నారు. గత మార్చిలో ఒక్క రోజు వ్యవధిలో 837 విమానాల రాకపోకలతో ముంబై విమానాశ్రయం లండన్‌లోని గట్విక్ ఎయిర్‌పోర్ట్ (757 విమానాల రాకపోకలు)ను వెనక్కు నెట్టింది. ముంబై విమానాశ్రయం 24 గంటల పాటు పనిచేస్తే, ప్రభుత్వ నిషేధం కారణంగా గట్విక్ ఎయిర్‌పోర్ట్ ఉదయం 5 నుంచి రాత్రి 12 గంటల వరకే పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ విమానాశ్రయానికి 2018లో రోజుకు 870 ఫ్లైట్ల రాకపోకల సామర్థ్యం ఉంది. 

ఈవీఎంలను ఎవరికీ అమ్మొద్దని ఈసీఐ ఆదేశం 
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల అమ్మకానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్(బీఈఎల్), ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్)లకు ఆదేశాలు జారీ చేసింది. తమ కోసం రూపొందించిన ఈవీఎంలను రాష్ట్రాల ఎన్నికల సంఘాలకు (ఎస్‌ఈసీ) కానీ, విదేశీ ఎన్నికల నిర్వహణ సంస్థలకు కానీ తమ అనుమతి లేకుండా అమ్మకూడదని పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు సంస్థలకు 2017, మే 27న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. అయితే, ఈ ఆదేశాలపై 2017 నవంబర్‌లో జరిగిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ల జాతీయ సదస్సులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు ఒక సమాచార హక్కు విజ్ఞాపన ద్వారా వెల్లడైంది. ఈ విషయాన్ని ఈసీతో చర్చించాలని చివరకు నిర్ణయించారు. ఈసీఐ, ఎస్‌ఈసీ.. రెండూ కూడా ఈసీఐఎల్, బీఈఎల్ సంస్థల నుంచే ఈవీఎంలను కొనుగోలు చేస్తాయి. 

తొలిసారిగా మావో నేత ఆస్తుల అటాచ్‌మెంట్ 
బిహార్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ ఓ మావోయిస్టు కమాండర్‌కు చెందిన రూ.86 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. మావోయిస్టు ఆస్తులను ఈడీ వంటి దర్యాప్తుసంస్థ అటాచ్ చేయడం దేశంలో ఇదే తొలిసారి. అవినీతి నిరోధక చట్టం కింద సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా, అతని కుటుంబీకుల స్థిర, చరాస్తులను అటాచ్‌చేస్తూ ఈడీ ఆదేశాలిచ్చింది. యాదవ్ ప్రస్తుతం మావోయిస్టు బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ ‘మధ్య జోన్’ ఇన్‌చార్జిగా ఉన్నాడు. బిహార్‌లోని 5 ప్లాట్లను, ఢిల్లీలో ఫ్లాటు కొనుగోలుకు సంబంధించిన రూ.10.43 లక్షల నగదు, కొన్ని వాహనాలు, బ్యాంకు డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తొలిసారిగా మావో నేత ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎక్కడ : బిహార్
ఎవరు : సందీప్ యాదవ్ అలియాస్ బడ్కా భయ్యా

ద్వైపాక్షికం
పాలస్తీనా, యూఏఈ, ఒమన్‌లలో మోదీ పర్యటన
 రక్షణ, అంతర్గత భద్రత, ఉగ్రవాద నిరోధం తదితర అంశాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా ప్రధాని మోదీ పశ్చిమాసియా పర్యటన ఉంటుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకూ పాలస్తీనా, యునెటైడ్ అరబిక్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. దుబాయ్‌లో జరిగే ఆరో వరల్డ్ గవర్న్‌మెంట్ సదస్సులో ప్రసంగించడంతో పాటు ఒపేరా హౌస్‌లో జరిగే కార్యక్రమంలో అక్కడి భారతీయులను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. అలాగే అబుదాబి, దుబాయ్ నగరాల మధ్య హిందూ దేవాలయం నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా మోదీ శంకుస్థాపన చేస్తారు. ఒమన్ పర్యటనలో భాగంగా మస్కట్‌లోని 200 ఏళ్ల శివాలయాన్ని, సుల్తాన్ ఖబూస్ గ్రాండ్ మసీదును సందర్శిస్తారు. మూడు దేశాలతో సాగే చర్చల్లో ఉగ్రవాద నిరోధం చాలా కీలక అంశంగా ఉంటుంది. 

సుష్మా స్వరాజ్ నేపాల్ పర్యటన
ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేపాల్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. ఆమె ఫిబ్రవరి 2 నుంచి రెండు రోజులపాటు నేపాల్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీ, ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవ్‌బా, సీపీఎన్ మావోయిస్టు సెంటర్ చైర్మన్ ప్రచండతో సమావేశమయ్యారు.

ప్రాంతీయం 
తెలంగాణ నూతన సీఎస్‌గా శైలేంద్ర కుమార్ జోషి 
 రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం జనవరి 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు. 
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు నూతన ప్రధాన కార్యదర్శి 
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : శైలేంద్ర కుమార్ జోషి 

ఏటా ఏపీకి వచ్చే పర్యాటకులు 10 కోట్ల మంది 
ఏటా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)కి పర్యాటక రంగం అండగా నిలుస్తోంది. 2017-18 (ఏప్రిల్-నవంబర్)లో రాష్ట్రానికి పర్యాటకుల ద్వారా రూ.36,034 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కాలంలో రాష్ట్రాన్ని 10,62,80,739 మంది సందర్శించారని అధికారిక లెక్కల ద్వారా వెల్లడైంది. 
రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయం చిత్తూరు జిల్లా నుంచే వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. గతేడాది తిరుపతి సందర్శించిన పర్యాటకులతో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది. 

ముగిసిన మేడారం జాతర
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఫిబ్రవరి 2న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ‘‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామన్నారు. జాతర కోసం 200 నుంచి 300 ఎకరాల స్థలం సేకరిస్తామని తెలిపారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రతి రెండేళ్లకొకసారి జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 3న ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగిసిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర
ఎప్పుడు : జనవరి 31 - ఫిబ్రవరి 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి

అమరావతిలో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ జనరల్ గిరీశ్ సాహ్నీ, సీనియర్ శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 6న సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్ ఫర్ స్కేలింగ్ అప్ అండ్ డిమాన్‌స్ట్రేషన్ ఆఫ్ రెలవెంట్ సీఎస్‌ఐఆర్ టెక్నాలజీస్’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రం 
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎక్కడ : అమరావతిలో 

ఏపీ తాత్కాలిక హైకోర్టుకు ఏఎన్‌యూ భవనాలు 
తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ప్రాంగణంలోని కొన్ని భవనాలను ఎంపిక చేశామని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఆయా భవనాలను పరిశీలించేందుకు రావాలని కోరుతూ ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనాల ఏర్పాటు పరిశీలన కమిటీకి సర్కార్ లేఖ రాసింది. యూనివర్సిటీ భవనాలను పరిశీలించిన తర్వాత కమిటీ.. తన అభిప్రాయాలను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ముందు ఉంచుతుంది. ఫుల్‌కోర్టులో మెజారిటీ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. 

ఆర్థికం 
జీడీపీ గణాంకాలను సవరించిన కేంద్రం 
 భారత్ 2015-16, 2016-17 స్థూల దేశీయోత్పిత్తి (జీడీపీ) వృద్ధి గణాంకాలకు సంబంధించి లెక్కలను మరింత మదింపుచేస్తూ, కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) జనవరి 31న ప్రకటన చేసింది. దీని ప్రకారం.. 2015-16 జీడీపీ వృద్ధి రేటు 8 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది. 2016-17 వృద్ధి రేటు యథాతథంగా 7.1 శాతంగా ఉంది. ఈ రెండేళ్లకు సంబంధించి జీడీపీ విలువలు వరుసగా రూ.113.86 లక్షల కోట్లు, రూ.121.96 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం
దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాలకు (భారత జనాభాలో దాదాపు 40 శాతం) వైద్య ఖర్చుల కవరేజ్ అందించేందుకు ఉద్దేశించిన ‘మోదీ కేర్’ లేదా జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ఆగస్టు 15 లేదా, గాంధీ జయంతి (అక్టోబర్ 2)నాడు ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ పథకంలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా లభిస్తుంది. దీనికయ్యే ఖర్చును 60 శాతం కేంద్ర ప్రభుత్వం మిగిలిన 40 శాతాన్ని రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే 2018-19 కేంద్ర బడ్జెట్‌లో దీనికోసం రూ.2 వేల కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేశారు. ఈ వైద్య పథకం రీ-ఇంబర్స్‌మెంట్ కాకుండా క్యాష్‌లెస్ విధానంలో ఉండనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం
ఎప్పుడు : త్వరలో
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : 10 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిండానికి

సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారత్ 
2017లో భారత్ నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు వలస వెళ్లారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భారత్ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు. 
నివేదికలోని కీలక అంశాలు... 
- 2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాది కాగా రెండో స్థానంలో భారత్ ఉంది. టర్కీ 6,000 మంది, బ్రిటన్ 4,000 మంది, ఫ్రాన్‌‌స 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది. 
- మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి. 
- మిలియనీర్ల సంపద ఎక్కువగా వున్న దేశాల్లో భారత్‌కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్ డాలర్లు. భారత్‌లో 3,30,400 మంది మిలియనీర్లు ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయంగా సంపన్నుల వలసలో రెండో స్థానంలో భారత్ 
ఎప్పుడు : ఫిబ్రవరి 4 
ఎవరు : న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్

భారత జీడీపీ వృద్ధి రేటుపై మెరిల్‌లించ్ అంచనా 
రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో భారత జీడీపీ 7.5 శాతం స్థాయిలో వృద్ధి చెందుతుందని, దీనికి తక్కువ బేస్ కారణమని, ఆ తర్వాతి ఆరు నెలల్లో 7 శాతానికి తగ్గిపోతుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ పేర్కొంది. వృద్ధి రేటు పుంజుకున్నా గానీ, వాస్తవ సామర్థ్యం కంటే ఒక శాతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. 2017-18లో నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాలతో వృద్ధి కనిష్టానికి (తక్కువ బేస్) చేరినందున 2018-19 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో జీడీపీ 7.5 శాతానికి పుంజుకుంటుందని తెలిపింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : 2018-19లో భారత జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.5 శాతం 
ఎప్పుడు : ఫిబ్రవరి 5 
ఎవరు : బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్‌లించ్ 

ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు 
రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి 3న అసోంలోని గువహటిలోప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్గే, పలువురు కేంద్రమంత్రులు, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, 16 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సైన్స్ అండ్ టెక్నాలజీ 
కనువిందు చేసిన సూపర్ బ్లూ బ్లడ్ మూన్ 
 ప్రపంచవ్యాప్తంగా సూపర్ బ్లూ బ్లడ్‌మూన్ జనవరి 31న కనువిందు చేసింది. అమెరికాతోపాటు ఆస్ట్రేలియా, పలు ఆసియా దేశాలు, రష్యాలోని కొన్ని భాగాల్లో కోట్లాది మంది ప్రజలు ఈ ఖగోళ అద్భుతాన్ని ఉత్సాహంగా వీక్షించారు. కాలిఫోర్నియాతోపాటు పశ్చిమ కెనడాలోని ప్రజలు చంద్ర గ్రహణాన్ని పూర్తిగా చూశారని నాసా వెల్లడించింది. దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ యూరప్‌తోపాటు ఆఫ్రికాలోని చాలా దేశాల్లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్ కనిపించలేదు. భారత్‌లోనూ అనేక మంది ప్రజలు చంద్రగ్రహణాన్ని వీక్షించారు. 
పౌర్ణమినాడు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌మూన్ అంటారు. అలాగే ఒకే నెలలో రెండుసార్లు పౌర్ణమి వస్తే దానిని బ్లూ మూన్ అంటారు. చంద్రగ్రహణం నాడు ముదురుఎరుపు రంగులో కనిపించే చంద్రుడిని బ్లడ్‌మూన్ అంటారు. జనవరి 31న ఈ మూడు ఏకకాలంలో ఆవిష్కృతమయ్యాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కనువిందు చేసిన సూపర్ బ్లడ్ మూన్ 
ఎప్పుడు : జనవరి 31 
ఎక్కడ : ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో 

స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామి కరంజ్ జలప్రవేశం
భారత నావికాదళంలో స్కార్పిన్ శ్రేణికి చెందిన మూడో అత్యాధునిక జలాంతర్గామి ఐఎన్‌ఎస్ కరంజ్ జలప్రవేశం చేసింది. నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్‌లాంబా భార్య రీనా లాంబా జనవరి 31న ముంబైలో ఐఎన్‌ఎస్ కరంజ్‌ను ప్రారంభించారు. ఫ్రెంచ్ నౌకా తయారీ సంస్థ డీసీఎన్‌ఎస్ భాగస్వామ్యంతో స్కార్పిన్ జలాంతర్గాముల్ని ముంబైలోని మజ్‌గావ్ డాక్ లిమిటెడ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఐఎన్‌ఎస్ కరంజ్‌తో నేవీలో మూడు స్కార్పిన్ శ్రేణి జలాంతర్గాములను ప్రవేశపెట్టినట్లయింది. ఛత్రపతి శివాజీ నావికాదళం ఆధీనంలోని కరంజా ద్వీపం పేరు మీదుగా ఈ జలాంతర్గామికి ఐఎన్‌ఎస్ కరంజ్‌గా నామకరణం చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జలప్రవేశం చేసిన స్కార్పియన్ శ్రేణి జలాంతర్గామని కరంజ్ 
ఎప్పుడు : జనవరి 31 
ఎక్కడ : ముంబైలో 

చెన్నైలో కృత్రిమ చెవి తయారీ 
దేశంలోనే ప్రప్రథమంగా చెన్నై సైన్స్ ల్యాబ్‌లో వైద్యులు కృత్రిమ చెవిని రూపొందించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రయోగం విజయవంతమైనట్లు సిమ్స్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో కృత్రిమ చెవి నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, సిమ్స్ ఆసుపత్రి సంయుక్తంగా దీనిని రూపొందించింది. చెవులు కోల్పోయిన వారి కోసం వారి దేహంలోని ఒక ప్రదేశంలో కణాలను తీసుకొని ల్యాబ్‌లో కృత్రిమ చెవులను తయారు చేస్తున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే ప్రప్రథమంగా కృత్రిమ చెవిని తయారు చేసిన వైద్యులు 
ఎప్పుడు : 2018 ఫిబ్రవరి 
ఎవరు : చెన్నై సైన్స్ ల్యాబ్ వైద్యులు

అగ్ని-1 పరీక్ష విజయవంతం 
అణ్వాయుధ సామర్థ్యం కలిగిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం ఫిబ్రవరి 6న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని బాలసోర్‌లోగల అబ్దుల్ కలామ్ దీవి నుంచి దీన్ని ప్రయోగించారు. భారతీయ ఆర్మీకి చెందిన స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పరీక్షించిన క్షిపణ 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చేధించగలదు. అగ్ని -1లో ఇది 18వ వర్షెన్. నిర్ణీత సమయంలోనే క్షిపణి టార్గెట్‌ను చేధించినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. ఈ క్షిపణి 2004లోనే సైన్యానికి అందుబాటులోకి వచ్చింది. సైనిక దళాలు తమ రెగ్యులర్ శిక్షణ విన్యాసాల సందర్భంగా దీనిని పరీక్షించారు. లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకునే ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ అగ్ని-1 క్షిపణిలో ఉందని అధికారులు తెలిపారు. రేంజ్, అక్యూరెసీలో అగ్ని -1 అత్యద్భుత ప్రదర్శన జరిపినట్లు అధికారులు చెప్పారు. 15 మీటర్లు పొడవు ఉండే అగ్ని-1 సుమారు 12 టన్నుల బరువు ఉంటుంది. ఇది సుమారు వెయి్య కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. ఇదే బేస్ నుంచి గతంలో అగ్ని-1 క్షిపణిని 2016 నవంబర్ 22వ తేదీన ప్రయోగించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అగ్ని-1 పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎక్కడ : అబ్దుల్ కలామ్ దీవి, ఒడిశా 

అతి చిన్న రాకెట్ ప్రయోగం విజయవంతం
జపాన్ అంతరిక్ష సంస్థ..జక్సా ఫిబ్రవరి 4న ప్రపంచంలోనే అతి చిన్న రాకె ట్(ఎస్‌ఎస్-520)ను విజయవంతంగా ప్రయోగించింది. దీని ద్వారా ట్రైకామ్-1ఆర్(సూక్ష్మ ఉపగ్రహం)ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఎస్‌ఎస్-520 పొడవు 10 మీటర్లు కాగా, వ్యాసం 53 సెంటీమీటర్లు. ఈ ప్రయోగం కగోషిమా ఫ్రిపెక్చర్‌లోని ఉంచినోరా అంతరిక్ష కేంద్రం నుంచి జరిగింది. 

విహరించిన తేలికపాటి హెలికాప్టర్
భారత తేలికపాటి పోరాట హెలికాప్టర్(ఎల్‌సీహెచ్-టీడీ2) జనవరి 31న బెంగళూరులో 20 నిమిషాలపాటు విహరించింది. దీనికి తొలిసారిగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) రూపొందించిన ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్(ఏఎఫ్‌సీఎస్)ను అమర్చి ప్రయోగించారు.

క్రీడలు 
న్యూఢిల్లీలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ 
 దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్‌జీ)’ జనవరి 31న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని అన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. 
అండర్-17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ 
ఎప్పుడు : జనవరి 31 - ఫిబ్రవరి 8
ఎక్కడ : న్యూఢిల్లీ

మానవ్‌కు టీటీ అండర్-18 టాప్ ర్యాంక్
భారత యువ ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో టాప్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. గుజరాత్‌కు చెందిన మానవ్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకులో 6,396 రేటింగ్ పాయింట్లతో అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా మానవ్ చరిత్రకెక్కాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : టేబుల్ టెన్నిస్ అండర్-18 టాప్ ర్యాంక్
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : మానవ్ వికాస్ ఠక్కర్

ఇండియా ఓపెన్ టోర్నీలో భారత్‌కు 8 స్వర్ణాలు
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 1న ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తం 41 పతకాలను సొంతం చేసుకున్నారు.
మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు.
పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0-5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఓపెన్ టోర్నీలో భారత్‌కు 8 స్వర్ణాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : మేరీకోమ్, మనీషా, పింకీరాణి, లవ్లీనా మొదలైనవారు

అండర్ - 19 ప్రపంచ కప్ విజేత భారత్ 
న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్ - 19 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. మౌంట్ మాంగనీలో జరిగిన ఫైనల్లో టీ మిండియా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెల్చుకుని కొత్త రికార్డు నెలకొల్పింది. 
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ మన్‌జ్యోత్ కల్రా (102 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కల్రాకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ (6 మ్యాచ్‌ల్లో 372 పరుగులు; ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. 
భారత్ ఇంతకముందు 2000, 2008, 2012లో అండర్ - 19 ప్రపంచ కప్ గెలుచుకుంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : అండర్ - 19 క్రికెట్ ప్రపంచ కప్ 
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎక్కడ : మౌంట్ మాంగనీ, న్యూజిలాండ్ 
ఎవరు : విజేత భారత్, రన్నరప్ ఆస్ట్రేలియా 

ఇండియా ఓపెన్ టైటిల్ విజేత బీవెన్ జాంగ్
ఇండియా ఓపెన్ టైటిల్‌ను చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 4న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, టాప్ సీడ్ సింధుని ఓడించి జాంగ్ టైటిల్‌ను గెలుచుకుంది. తన కెరీర్‌లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియా ఓపెన్ - 2018
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎవరు : విజేత బీవెన్ జాంగ్, రన్నరప్ పీవీ సింధు

వార్తల్లో వ్యక్తులు 
బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం 
 కర్ణాటకలోని బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తమ దేశానికి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచాక 130 దేశాల ప్రముఖులను ఆహ్వానించి ఆ దేశ సంప్రదాయాల ప్రకారం విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 7, 8 తేదీల్లో ఏర్పాటు చేసిన విందుకు భారతదేశం నుంచి ఇద్దరు నేతలను ఎంపిక చేశారు. వీరిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒకరు కాగా, బళ్లారి ఎంపీ శ్రీరాములు మరొకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బళ్లారి ఎంపీకి ట్రంప్ ఆహ్వానం
ఎప్పుడు : ఫిబ్రవరి 2న
ఎవరు : శ్రీరాములు
ఎందుకు : అధ్యక్షుడి అధికారిక విందులో పాల్గొనడానికి

కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి
కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దినేశ్ మహేశ్వరి నియామకం దాదాపుగా ఖాయమైంది. ఈ మేరకు ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతత్వంలోని కొలీజియం జస్టిస్ దినేశ్ మహేశ్వరి పేరును ప్రతిపాదించింది. అక్టోబర్ 9వ తేదీన జస్టిస్ ఎస్‌కే ముఖర్జీ పదవి విరమణ చేయగా.. అప్పటి నుంచి కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. దినేశ్ మహేశ్వరి ప్రస్తుతం మేఘాలయా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కర్ణాటక హైకోర్టు సీజే నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 2
ఎవరు : జస్టిస్ దినేశ్ మహేశ్వరి

విద్యార్థుల కోసం మోదీ పుస్తకం - ఎగ్జామ్ వారియర్స్
వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు తన అనుభవాలతో 25 అధ్యాయాలు (మంత్రాలు, యోగాసనాలతో) పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రాశారు. ఎగ్జామ్ వారియర్స్ (పరీక్షా యోధులు) పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫిబ్రవరి 3న ఢిల్లీలో విడుదల చేశారు. ఈ పుస్తకం రాయటం ద్వారా.. ఇంతవరకు ఏ దేశాధ్యక్షుడు గానీ.. ప్రధాని గానీ సాధించని అరుదైన ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. భారత యువతకు అంకితమిచ్చిన ఈ పుస్తకాన్ని ‘ది ఐడియా’ అనే నరేంద్రమోదీ మొబైల్ యాప్‌తో అనుసంధానించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఎగ్జామ్స్ వారియర్స్ పుస్తకం 
ఎప్పుడు : ఫిబ్రవరి 3 
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ 

తేజస్‌లో అమెరికా వాయు సేనాధిపతి 
దేశీయంగా తయారైన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను అమెరికా వాయు సేనాధిపతి జనరల్ డేవిడ్ గోల్డ్‌ఫీన్ ఫిబ్రవరి 3న నడిపారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న వైమానికస్థావరం వద్ద భారత ఎయిర్ వైస్ మార్షల్ ఏపీ సింగ్‌తో కలసి ఆయన తేజస్‌లో చక్కర్లు కొట్టారు. భారత వాయుసేన ఈ సమాచారాన్ని ట్వీటర్‌లో ప్రకటించింది. భారత, అమెరికా వాయుసేనల మధ్య బంధాన్ని మరింత దృఢపరిచేందుకు కృషిచేస్తానని గోల్డ్‌ఫీన్ తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తేజస్‌ను నడిపిన అమెరికా వాయు సేనాధిపతి 
ఎప్పుడు : ఫిబ్రవరి 3
ఎక్కడ : జోధ్‌పూర్
ఎవరు : డేవిడ్ గోల్డ్‌ఫీన్

నీతి ఆయోగ్ సీఈవో పదవీకాలం పొడిగింపు 
నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ కాంత్ పదవీకాలాన్ని 2019 జూన్ 30 వరకు పొడిగించారు. కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించడంతో అమితాబ్ పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. కాలపరిమితి రెండేళ్లు ఉండే నీతి ఆయోగ్ సీఈవో పదవిని అమితాబ్ 2016 ఫిబ్రవరి 17న చేపట్టారు. నీతి ఆయోగ్‌లో పదవిచేపట్టకముందు ఆయన పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం కార్యదర్శిగా పనిచేశారు. అమితాబ్ కేరళ కేడర్‌కు చెందిన 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పదవీకాలం పొడిగింపు 
ఎప్పుడు : 2019 జూన్ 30 వరకు 
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

కొత్త డీజీఎంఓ అనిల్ చౌహాన్
భారత సైన్యం నూతన డీజీఎంఓ(డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్)గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ జనవరి 30న బాధ్యతలు స్వీకరించారు. చౌహాన్‌కు జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లోని చొరబాటు వ్యతిరేక ఆపరేషన్లలో అపార అనుభవం ఉంది.

ఫిడెల్ క్యాస్ట్రో కుమారుడి ఆత్మహత్య
క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో పెద్ద కుమారుడు డియాజ్ బలర్ట్(68) ఫిబ్రవరి 2న హవానాలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన గత కొన్ని నెలలుగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. డియాజ్ రాజకీయాల్లో లేనప్పటికీ అచ్చు తండ్రి పోలికలతో ఉండటంతో అక్కడి వారు ఆయన్ను ఫిడెల్ జూనియర్‌గా పిలుస్తుంటారు. ఫిజిక్స్ శాస్త్రవేత్తయిన డియాజ్.. క్యూబా అణుశక్తి కార్యక్రమంలో కీలకపాత్ర పోషించారు.

అవార్డులు 
నరిశెట్టికి ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 
 ప్రముఖ సాహితీవేత్త ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018ని గిజ్‌మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి (అమెరికా)కి ప్రకటించారు. ఈ మేరకు మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తెలిపారు. ఫిబ్రవరి 21న న్యూఢీల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ కార్యక్రమంలో అవార్డుని ప్రదానం చేస్తామని తెలిపారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎన్‌ఆర్ చందూర్-జగతి అవార్డు 2018 
ఎప్పుడు : ఫిబ్రవరి 5
ఎవరు : రాజు నరిశెట్టి(అమెరికా)

Comments